Hindu Rituals: అంతిమ సంస్కారాల్లో.. మట్టి కుండను ఎందుకు పగలగొడతారు..? ఆ పరామర్థం ఎంటో తెలుసా..? – Telugu News | Hindu Funeral Rituals: The Spiritual Significance of Breaking the Clay Pot


హిందూ మతంలో మనిషి జననం నుంచి మరణం వరకు 16 సంస్కారాలను నిర్దేశించారు. వీటిలో చివరిది అంత్య సంస్కారం లేదా దహన సంస్కారం. ఇది జీవిత యాత్రకు ముగింపు సూచించే ఆచారం కాబట్టి దీనిని “అంతిమ ఆచారాలు” అని కూడా అంటారు. ఒక వ్యక్తి మరణించిన తరువాత, అతని ఆత్మ శాంతిని పొందుతూ మోక్ష మార్గంలో సాగాలని ఆకాంక్షిస్తూ ఈ కర్మలను నిర్వహిస్తారు. మత గ్రంథాల ప్రకారం.. శాస్త్రాల ప్రకారం, మరణించిన వ్యక్తి శరీరాన్ని అగ్నికి సమర్పించడం “ముఖాగ్ని” అని పిలుస్తారు. సాధారణంగా కుటుంబ పెద్ద లేదా కుమారుడు ఈ కర్మను నిర్వహిస్తారు. అయితే, దహనానికి ముందు ఒక ముఖ్యమైన ఆచారం ఉంటుంది.. అదే నీటితో నిండిన మట్టి కుండను పగలగొట్టడం.

చిల్లులు గల మట్టి కుండను నీటితో నింపి, దాన్ని భుజంపై ఉంచుకుని చితి చుట్టూ ముందుగా సవ్యదిశలో ప్రదక్షిణ చేస్తారు. అనంతరం అపసవ్య దిశలో కూడా ప్రదక్షిణ చేయడం జరుగుతుంది. ఈ సమయంలో కుండలోని నీరు నెమ్మదిగా కారుతూ ఉంటుంది. చివరగా ఆ కుండను వెనక్కి కిందికి జారవిడవడంతో అది పగిలిపోతుంది.

ఈ ఆచారం వెనుక అర్థం

శాస్త్రాల ప్రకారం..

మట్టి కుండ — మానవ శరీరానికి ప్రతీక.
నీరు — ఆత్మకు సూచకం.

ప్రదక్షిణ సమయంలో కుండ నుంచి కారే నీరు, శరీరం, ఆత్మ మధ్య బంధం క్రమంగా తగ్గిపోవడాన్ని సూచిస్తుంది. కుండ పగలగొట్టడం అంటే ఆత్మ పూర్తిగా శరీరాన్ని విడిచి తన యాత్రను కొనసాగించాలనే సంకేతం.

కుండ పగలగొట్టడానికి మతపరమైన కారణం

మన శరీరం పంచభూతాల (భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం) సమ్మేళనం. దహన సంస్కారం ద్వారా శరీరం ఈ పంచభూతాల్లో లీనమవుతుంది. కుండ విరగడం ద్వారా మరణించిన వ్యక్తి ఈ లోకంతో ఉన్న అన్ని ప్రాపంచిక బంధాలను తెంచుకుని, మోక్ష మార్గంలో ముందుకు సాగాలని భావిస్తారు.
ఈ విధంగా మట్టి కుండ పగలగొట్టే ఆచారం, ఆత్మ యొక్క విముక్తి, శాశ్వత యాత్రను సూచించే గాఢమైన ఆధ్యాత్మిక సంకేతంగా భావించబడుతుంది.

(Disclaimer: ఈ వార్తలోని సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)



Source link

Leave a Comment