Telangana: బిగ్ న్యూస్.. ఈ నెలలో తెలంగాణలో మరో ఎన్నికలు..! త్వరలో నోటిఫికేషన్.. – Telugu News | There is a possibility that the notification for the municipal elections in Telangana will be released this month


గత ఏడాది చివర్లో తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అత్యంత సందడిగా గ్రామాల్లో ఈ ఎన్నికలు జరిగాయి. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలుచుకోగా.. రెండో స్థానంలో బీఆర్ఎస్, మూడో స్ధానంలో బీజేపీ నిలిచాయి. కొత్త సర్పంచ్‌లు కూడా అన్ని గ్రామాల్లో ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. దీంతో గ్రామాల్లో పరిపాలన మరింతగా పుంజుకుంది. ఈ పంచాయతీ ఎన్నికలు ముగియడంతో మిగిలిన స్థానిక సంస్థల ఎన్నికలైన మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్దమైంది. ఇందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఏర్పాట్లలో నిమగ్నమైంది.

ఈ నెలలోనే నోటిఫికేషన్..!

ఈ నెలలోనే రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ నెలలో నోటిఫికేషన్ వస్తుందని, ఫిబ్రవరిలో ఎన్నికలు జరుగుతాయని వివరించారు. దీంతో రాష్ట్రంలో ప్రజా పాలన మరింత పటిష్టం కానుందని తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా మంత్రి అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే దానిపై స్పష్టత ఇచ్చారు. ఉపాధి హామీ పథకంపై చర్చ జరుగుతున్న తరుణంలో బీఆర్ఎస్ సభ్యులు సభ నుంచి పారిపోయారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ తప్పులను అసెంబ్లీకి వచ్చి నిరూపించాలి తప్ప పారిపోవడం ఏంటని నిలదీశారు.

బీజేపీతో బీఆర్ఎస్ రహస్య స్నేహం

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బీజేపీ, బీఆర్ఎస్‌పై తీవ్ర విమర్శలు కురిపించారు. రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్ ఊనికి కోల్పోతున్నాయని విమర్శించారు. బీఆర్ఎస్, బీజేపీ రహస్య స్నేహాన్ని కొనసాగిస్తున్నాయని అన్నారు. గత పదేళ్లు తెలంగాణలో పాలన కొనసాగించిన కేసీఆర్.. కనీసం తన సొంత పార్టీ ఎమ్మెల్యేలకు కూడా గౌవరం ఇవ్వలేదన్నారు. తన సొంత నిర్ణయాలనే కేసీఆర్ అమలు చేసేవావరని, అధికారం కోల్పోయాక ప్రజల సానుభూతి కోసం ప్రాకులాడుతున్నారని అడ్లూరి లక్ష్మణ్ విమర్శలు గుప్పించారు.



Source link

Leave a Comment