ఒమన్ తీరంలో భారతీయుల మృతిపై ఇరాన్ సంతాపం.. అమెరికా చర్యలపై ఫైర్..! | Iran condemns US attack on ship that killed 3 Indian sailors in Oman


ఒమన్ తీరంలో జరిగిన వాణిజ్య నౌక ఘటనలో భారతీయ నావికులు మృతి చెందిన నేపథ్యంలో ఇరాన్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై స్పందించిన ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి, పబ్లిక్ డిప్లొమసీ సెంటర్ అధిపతి ఇస్మాయిల్ బఖాయ్ భారత ప్రజలకు, కేంద్ర ప్రభుత్వానికి, మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన ప్రకటనలో భారతీయ నావికుల మృతిపై ఇరాన్ సానుభూతి వ్యక్తం చేశారు.

అదే సమయంలో ఈ ఘటనకు సంబంధించి అమెరికాపై ఇరాన్ తీవ్ర ఆరోపణలు చేసింది. ఒమన్ తీరంలో దాడికి గురైన నౌక ఘటన అమెరికా కొనసాగిస్తున్న సాయుధ దోపిడీ, సముద్రపు దొంగతనం విధానాలకు నిదర్శనమని ఇస్మాయిల్ బఖాయ్ విమర్శించారు. ఇటువంటి చర్యలు అంతర్జాతీయ చట్టాలకు, సముద్ర భద్రతా సూత్రాలకు విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. అమెరికా చేపడుతున్న చర్యలు ప్రపంచ శాంతి, భద్రతలకు ముప్పుగా మారుతున్నాయని, అంతర్జాతీయ సమాజం ఈ అంశంపై స్పందించి అమెరికాను జవాబుదారీగా నిలబెట్టాలని కోరారు.

ఇదిలావుంటే, ఈ ఘటన సమయంలో నౌకలో మొత్తం 24 మంది భారతీయ సిబ్బంది ఉన్నట్లు సమాచారం. వీరిలో 21 మందిని సురక్షితంగా రక్షించగా, ముగ్గురు గల్లంతయ్యారు. అనంతరం గల్లంతైన వారిలో ఇద్దరి మృతదేహాలను గుర్తించారు. అయితే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన చీఫ్ ఇంజనీర్ పటానాల సురేష్ ఇప్పటికీ కనిపించకపోవడంతో ఆందోళన నెలకొంది. ఆయన కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నప్పటికీ, సజీవంగా లభించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని నివేదికలు సూచిస్తున్నాయి.

ఈ ఘటనపై భారత ప్రభుత్వం కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఘటనను ఖండిస్తూ, న్యూఢిల్లీలోని అమెరికా దౌత్యవేత్తకు అధికారికంగా నిరసన తెలిపింది. భారతీయ నావికుల భద్రతకు సంబంధించిన అంశాన్ని అత్యంత ప్రాధాన్యంతో పరిగణిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒమన్ తీరంలో చోటుచేసుకున్న ఈ ఘటన అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారగా, దీనిపై మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Comment