తెలుగు సినిమా చరిత్రలో తనదైన హాస్యంతో ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన గొప్ప నటుడు, విలక్షణ వ్యక్తిత్వం ఉన్న మేధావి సుత్తి వీరభద్రరావు. “హైదరాబాదు, అలహాబాదు, ఔరంగాబాదు” వంటి డైలాగులతో సుత్తి వేలుతో కలిసి తెలుగు ప్రేక్షకులకు చిరస్మరణీయం అయిన “సుత్తి వీరభద్రరావు – సుత్తి వేలు” జంటను పరిచయం చేశారు. మామిడిపల్లి ఇంటిపేరుతో తూర్పు గోదావరి జిల్లా తునిలో జన్మించిన వీరభద్రరావు, చిన్నప్పటి నుంచి చదువులో అత్యంత చురుకు. విజయవాడ ఏకేటీపీ స్కూల్లో పదవ తరగతి వరకు, ఎస్ఆర్ఆర్ కాలేజీలో బీకాం పూర్తి చేశారు. చదువు పట్ల ఆయనకున్న అంకితభావం, అపారమైన జ్ఞానం ప్రత్యేకమైనవి. ప్రతి పనినీ మనసు పెట్టి చేసేవారు. పాఠశాల దశ నుంచే నాటకాలపై అపారమైన ఆసక్తిని పెంచుకుని, ఉత్తమ బాలనటుడిగా గుర్తింపు పొందారు. క్రికెట్ పట్ల కూడా ఆసక్తి ఉన్నా, తల్లి ప్రోత్సాహంతో నాటకాలపై దృష్టి సారించారు.
Read More Article: Trending : ఏం పాట మావ.. 26 ఏళ్లుగా యూట్యూబ్లో ట్రెండింగ్.. మళ్లీ మళ్లీ వినాలనిపించే సాంగ్..
సాహిత్యం పట్ల ఆయనకు అమితమైన ప్రేమ ఉండేది. తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో గొప్ప రచయితల పుస్తకాలను విపరీతంగా చదివేవారు, కొని జాగ్రత్తగా దాచుకునేవారు. తన పుస్తకాలను ఎవరికీ ఇవ్వడానికి ఇష్టపడని పుస్తకాల పురుగు ఆయన. ఆయన చదివే అలవాటు, మంచి మాటకారితనం, గొంతులోని వైవిధ్యం ఆల్ ఇండియా రేడియోలో అనౌన్సర్గా ఉద్యోగం తెచ్చిపెట్టాయి. 1971లో ఉద్యోగంలో చేరిన తర్వాత, మరుసటి ఏడాది నాటకాల విభాగంలో చీఫ్గా నియమితులయ్యారు. రేడియో నాటకాల విభాగంలో రచయితగా, దర్శకుడిగా, నటుడిగా ఎదిగి, తన గొంతుతో వేలకొద్దీ నాటకాలు ప్రదర్శించారు.
సినీ ప్రస్థానం దర్శకుడు ధవళ సత్యం ద్వారా ప్రారంభమైంది. ఆయన “జాతర” సినిమాలో ఒక చిన్న పాత్రను ఇచ్చారు. కానీ జంధ్యాల తీసిన “నాలుగు స్తంభాల ఆట” సినిమా ఆయన కెరీర్లో ఒక మైలురాయి. ఈ సినిమాలో “సుత్తి” పాత్రతో ఆయన విపరీతమైన గుర్తింపు పొందారు. “కారణం లేని నవ్వు, తోరణం లేని పందిరి, పూర్ణం లేని బూరె పనికిరావన్నాడు శాస్త్రకారుడు” వంటి డైలాగులు ఆయన మార్కు హాస్యాన్ని చాటాయి. సుత్తి వేలుతో కలిసి తెలుగు హాస్యాన్ని కొత్త పుంతలు తొక్కించారు. వీరిద్దరూ రేలంగి, రమణారెడ్డి తర్వాత అంతటి గొప్ప కామెడీ జోడీగా పేరుపొందారు. “పుత్తడి బొమ్మ”, “ఆనంద భైరవి”, “మూడు ముళ్లు”, “శ్రీవారికి ప్రేమలేఖ”, “బాబాయ్ అబ్బాయ్”, “రెండు రెళ్ళు ఆరు”, “మొగుడు పెళ్ళాలు”, “చంటబ్బాయి”, “ఆ నా పెళ్ళంట”, “వివాహ భోజనంబు”, “చూపులు కలిసిన శుభవేళ”, “నీకు నాకు పెళ్ళంట” వంటి అనేక విజయవంతమైన చిత్రాల్లో నటించారు.
ఏడాదికి 10-15 సినిమాల్లో నటిస్తూ రేడియో ఉద్యోగానికి రాజీనామా చేసి, కుటుంబంతో కలిసి చెన్నైకి మారారు. కుటుంబం, సినిమాలు, పుస్తకాలు, సుత్తి వేలు స్నేహం, జంధ్యాల ప్రేమతో జీవితాన్ని సంతోషంగా గడిపారు. చిన్న వయసులోనే వృద్ధుల పాత్రలు పోషించి మెప్పించారు. తన పిల్లలకు చదువు ప్రాముఖ్యతను నొక్కి చెప్పేవారు. అయితే, ఆయన జీవితం విషాదంగా ముగిసింది. కేవలం 41 ఏళ్ల వయసులో, జూలై 30, 1989న తీవ్రమైన గుండెపోటుతో అకస్మాత్తుగా మరణించారు. ఆ సమయంలో జంధ్యాల “చిన్నకృష్ణుడు” సినిమా షూటింగ్లో ఉన్నారు. ఆయన మరణం అందరినీ, ముఖ్యంగా సినీ పరిశ్రమని షాక్కి గురిచేసింది. కేవలం ఆరేళ్ల సినీ ప్రయాణంలోనే సుమారు 200 చిత్రాల్లో నటించి మెప్పించడం ఆయన ప్రతిభకు నిదర్శనం.
Read More Article: Actor : అతడికి 57.. ఆమెకు 24.. కట్ చేస్తే.. నాలుగేళ్లుగా ప్రేమలో టాలీవుడ్ విలన్..
Read More Article: Rajamouli : ఆ హీరో నా పక్కన ఉంటే ఏదైనా చేయగలను.. రాజమౌళి కామెంట్స్..