ఉత్తరాంధ్రకు గోదావరి జలాల బాట..పోలవరం ఎడమ కాలువ ద్వారా తరలించే గోదావరి జలాలతో నాలుగు జిల్లాల్లోని వివిధ ఆయకట్టు ప్రాంతాలకు ప్రయోజనం చేకూరనుంది. మొత్తం 2,87,320 ఎకరాలకు సాగునీరు.. 5.23 లక్షల మందికి తాగునీటి సదుపాయం కల్పించేలా ఈ వ్యవస్థను రూపొందించారు. ప్రస్తుతం పాయకరావుపేట వద్ద విడుదలయ్యే నీటితో అనకాపల్లి జిల్లాలో 1.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు ప్రయోజనం కలగనుంది. ఐదు నదులను దాటుకుంటూ..పోలవరం ఎడమ కాలువ నిర్మాణం సాధారణమైన పని కాదు. ఏలేరు, పంపా, తాండవ, వరాహ, శారద నదులను దాటుకుంటూ కాలువ ముందుకు సాగింది. తూర్పు కనుమలు, క్లిష్టమైన భౌగోళిక పరిస్థితులను అధిగమిస్తూ కాలువ నిర్మాణాన్ని చేపట్టారు. వివిధ నదీ ప్రవాహాల వద్ద సైఫన్లు, అక్విడెక్టులు నిర్మించి గోదావరి జలాలకు మార్గం సుగమం చేశారు.